Monday, May 2, 2011

ఇప్పటి చిత్రాల్లో నీ యబ్బ, తొక్క, బొంగు మామూలయ్యాయి: దాసరి



స్వర్గం నరకం, ఏడంతస్తుల మేడ, నీడ, సర్దార్‌ పాపారాయుడు, బొబ్బిలి పులి ఇలా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకులకే ఆదర్శంగా నిలిచిన దర్శకుడు, ఇండస్ట్రీ పెద్ద దాసరి నారాయణరావు. అటువంటి వ్యక్తి.. ఈనాడు చిత్రాలు నిర్మిస్తుంటే... ప్రేక్షకులు సరిగ్గా రిసీవ్‌ చేసుకోవడంలేదు.

దానికి కారణం ఏమిటి? లోపం ఎక్కడుంది? ఇప్పుడు తనేం చేయాలనుకుంటున్నాడు వంటి పలు ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఆయన పుట్టినరోజు ఈనెల 4. ఆరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా 'నీడ' దాసరి చారిటబుల్‌ ట్రస్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ...మీ పుట్టినరోజు నాటి ఆహ్వానపత్రికలో 'ఫిలిమ్‌ డైరెక్టర్స్‌డే' అని ప్రచురించారు?
అవును. దీన్ని గర్వంగా చెబుతాను. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో దర్శకుడు అనేవాడే సినిమాకు ప్రాణం. కెప్టెన్‌. ఆ తర్వాతే హీరో. నిర్మాత కూడా దర్శకుడ్ని నమ్మి కోట్లు ఖర్చుపెడుతున్నాడు. అటువంటి నిర్మాత తల ఎత్తుకునేలా సినిమా తీసేది దర్శకుడే.. హీరోకాదు. అసలు అతను హీరో అని చెప్పేది కూడా దర్శకుడే. అతను ప్రవర్తన ఎలా ఉండాలి. ఎలా చేస్తే బాగుంటుంది. అని చెప్పి మరీ చేయించి... ఒక నటుడిగా తీర్చిదిద్దేది దర్శకుడు. లేదంటే అతనూ సామన్యుడు లాంటివారే. అందుకే ముందుగా దర్శకుడ్ని గౌరవించాలి.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మంచి చిత్రాలు తీసిన మీరు ఈనాడు తీయలేకపోవడానికి కారణం?
నేను తీయడం లేదని ఎవరన్నారు. యంగ్‌ ఇండియా, పరమవీరచక్ర తీశాను. అవి మంచి చిత్రాలు కాదని ఎవరంటారు. అవన్నీ మంచి పాయింట్‌తో తీసినవే.

సక్సెస్‌లు కాలేదు కదా?
సక్సెస్‌ అంటే ఏంటీ మీ దృష్టిలో... ప్రజల దృష్టిలో సక్సెస్‌. అంటే... థియేటర్లలో జనాలుండాలి. జనాలు లేకపోతే ఫెయిల్‌ అని తీర్పు చెప్పేస్తారు. ఆ అధికారం ఎవరిచ్చారు. ఈ రోజుల్లో సినిమా థియేటర్‌లో ఆడితే కనీసం వారం, రెండు వారాలు నిలబెట్టాలి. అలా లేనినాడు ఎంతమంచి చిత్రమైనా వీగిపోయింది. సాయికుమార్‌ నటించిన 'ప్రస్థానం'. శర్వానంద్‌ నటించిన అపంద్భావా చిత్రాలు గొప్ప చిత్రాలు. కానీ వాటిని ప్రజలు చూడలేదే.

అంటే ఈనాటి ట్రెండ్‌ మారిందంటారా?
ట్రెండ్‌ ఎప్పుడూ మారలేదు. అప్పుడు ఇప్పుడూ ఒక్కటే ట్రెండ్‌. శంకరాభరణం. మూడు వారాల వరకు జనాలు లేరు. ఆ తర్వాత దాని గురించి తెలిసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇలా ఎన్నో చిత్రాలున్నాయి. నేను తీసిన స్వర్గం నరకం నుంచి 25 చిత్రాల వరకు ఇలాగే నిదానంగా పుంజుకున్నవే. అప్పుడు ఇప్పుడు ఒక్కటే తేడా... థియేటర్‌ ఓనర్లు సినిమాను కనీసం వారం రెండు వారాలు ఉండనీయడంలేదు. దాంతో ప్రజలకు చేరలేకపోతుంది. దాంతో నిర్మాతకు లాస్‌ వస్తుంది.

దీనికి పరిష్కారం లేదా?
నేను ఒక్కటే చెబుతున్నాను. నా చిత్రమైనా, ఎవరి చిత్రమైనా... కనీసం రెండు వారాలపాటు నిర్మాతకు ఛాన్స్‌ ఇవ్వండి. రాత్రికి రాత్రే కలెక్షన్లు రావాలి అన్న చందంగా మారిపోయింది. ఒకరోజు కలెక్షన్‌ లేకపోతే.... సైకిల్‌స్టాండ్‌, క్యాంటిన్‌వాడు, ఇలా ఎవరికివారు సినిమా ఎత్తేయమని సూచిస్తున్నారు. థియేటర్‌ ఓనర్‌.. తమకు.. మెయింటైన్‌ ఛార్జీలుకూడా రావడం లేదని గోల చేస్తున్నారు. దాంతో ఆఖరికి నిర్మాత లాస్‌ అవుతున్నాడు. నా చిత్రాలకు వస్తే ఒక్క రెండు వారాలు బేర్‌ చేస్తే.. వారిని ఆదుకోవడానికి నేనున్నా. కానీ అది అమలుచేయడంలేదు. ఏదో సాకుతో ఎత్తేస్తున్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది?
ఏమీ బాగోలేదు. ఎవరికీ లాభంలేదు. అనవసరమైన పోటీతత్త్వం వచ్చింది. రిలీజైన మూడురోజుల్లోనే అంటే వీకెండ్‌ డేస్‌..శుక్ర, శని, ఆదివారాల్లో 50 థియేటర్లు ఇచ్చేస్తే దాంతో పెట్టుబడి వచ్చేయాలి అనే చూసే బాపతు వచ్చింది. దీనివల్ల మంచి సినిమాలు రావడంలేదు. హీరోలు పోటీపడి పారితోషికాలు పెంచేస్తున్నారు. దానికి నిర్మాతలు ఇస్తున్నారు. ఎందరివో పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. కానీ ఏ నిర్మాతకూ లాభంలేదు.

మరి అదే కాంబినేషన్‌లు మళ్ళీమళ్ళీ వస్తున్నాయిగదా?
ఇదొక చక్రం. ఇక్కడ గతంలోని అప్పుల్ని కవర్‌ చేయాలంటే.. కాంబినేషన్‌లతో చేస్తుండడమే గతి.

మరి చిన్నచిత్రాలు ఆడుతున్నాయిగదా?
ఆడుతున్నాయి. ఎన్ని ఆడుతున్నాయి. 'అలా మొదలైంది' ఈ ఏడాది సూపర్‌డూపర్‌ హిట్‌. దానికి వారంరోజులపాటు కలెక్షన్లే లేవు. ఆ టైమ్‌లో దాన్ని టేకప్‌ చేసుకుని కొన్ని ఏరియాల ఎగ్జిబిటర్లకు చెప్పి రన్‌ చేయించాను. ఇప్పుడు అది సక్సెస్‌లో దూసుకుపోతుంది. దీనికి కారణం ఏమిటి. ఎగ్జిబిటర్‌ తమ థియేటర్లలో సినిమాకు కొద్దిరోజులు ఊపిరి పోయాలి. లేదంటే చచ్చిపోతుంది.

దీనికితోడు సూడో మనస్తత్వం గల సాఫ్ట్‌వేర్‌ బ్యాచ్‌ ఒకటి తయారైంది. రిలీజ్‌కు ముందే సినిమా అలా ఉంటుంది. ఇలా ఉంటుందని తెగ మెసేజ్‌లు ఇచ్చేస్తున్నారు. పరమవీరచక్రకు లక్షా 20వేల మెసేజ్‌లు వచ్చాయి. ఇది కొత్త పోకడ. వీరి వల్ల ఇండస్ట్రీ నాశనం అవుతుంది. ఆ మెసేజ్‌లు చూసి మౌత్‌టాక్‌ స్ప్రెడ్‌ అయి మంచి సినిమా కూడా చెడిపోతుంది. అందుకే ఇతరుల సినిమాలకు కూడా నేను వారికి రివర్స్‌ మెసేజ్‌లు ఇవ్వడం మొదలెట్టాను.

ఇటీవలి సినిమాలపై మీ అభిప్రాయం?
ఏం సినిమాలండీ... అనిపిస్తుంది... కుటుంబసభ్యులతో చూడదగ్గ సినిమాలుగా లేవు. ఏవో ఒకటి రెండు చిత్రాలు మినహా ... కొన్ని చిత్రాల్లో- నీ యబ్బ, తొక్క, బొంగు, నీ యమ్మ.. ఇలాంటి పదాలతో యువతను పెడదోవ పట్టిస్తున్నారు. వీటిని వింటూ తల్లిదండ్రులు కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇదేకాదు ఏది చెడ్డ అలవాటున్నా దాన్ని ఖండించాల్సింది పోయి.. పిల్లలకు సపోర్ట్‌ చేయడం పెద్ద నేరం. ఇక్కడ ఉదాహరణ చెబుతాను... గతంలో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా నర్సాపూర్‌ వెళ్ళాం. అక్కడ ధియేటర్‌ ఓనర్‌.. ఆశ్రయం ఇచ్చారు. సాయంత్రం.. ఆయన మందు తాగుతున్నాడు. వాళ్ళ అబ్బాయి అంటే.. చిన్న కుర్రాడు... అతనికి కూడా మందు పోసి.. వాడు మాట్లాడే మాటలతో ఎంజాయ్‌ చేస్తున్నాడు.. ఇదేంటండీ.. అని అడిగాను... ఏదో పిల్లవాడు... ఇదో సరదా.. అంటూ చెప్పాడు. దీనివల్ల మీ పిల్లవాడి భవిష్యత్‌ నాశనం అవుతుంది అన్నాను. కానీ వాడే పెద్దయితే మానతాడులే అని బదులిచ్చాడు.

అదే ఊరు కొద్దికాలం తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. అదే థియేటర్‌కు వెళితే... ఆ పిల్లాడి ఫొటో దండేసి థియేటర్‌లో పెట్టారు. ఇదీ తల్లిదండ్రుల పెంపకం. సినిమాలైనా, రియలైనా.. తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలి. నేను చేసే సినిమాలో మంచి విలువులుంటాయి.

ఈ పుట్టినరోజు సందర్భంగా రాజకీయాల్లో పాల్గొనే అవకాశముందా?
నేను రాజకీయాల్లోంచి బయటకు రాలేదు. ఇప్పటి పరిస్థితుల్ని గమనిస్తున్నా... అవసరమైన సమయంలో.. రాజకీయాల గురించి చెబుతాను.

ఇటీవలే రేట్లు పెంచమని కొందరూ... వద్దని మరికొందరు అన్నారు. దీనిపై మీ స్పందన?
రేట్లు పెంచడం వల్ల ఉపయోగం ఎవరికి? నిర్మాతకు లాభం లేదు. ఎగ్జిబిటర్‌కే లాభం. మూడురోజుల్లో కొన్న మొత్తాన్ని లాగేయాలనుకోవడం దారణం. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను... బృందావనం సినిమా హైదరాబాద్‌ సుదర్శన్‌ థియేటర్‌లో వారానికి అద్దె 1లక్ష 75 వేల రూపాయలుగా ఉంది. అదే హీరో 'శక్తి' సినిమా వచ్చేసరికి 2లక్షల 45 వేలకు చేరింది.

అంటే.. ఆ సినిమా రిలీజ్‌కు ఈ సినిమా రిలీజ్‌కు ఏ యుద్ధాలు, సునామీలు రాలేదు కదా.. ఒక్కసారే అంత ఎందుకు పెంచారు. దీనికి సమాధానం ఎవరు చెబుతారు. ఈ రేటు చూసి నిర్మాత ఏమనుకోవాలి. డిస్ట్రిబ్యూటర్‌ ఏ రేటుతో తీసుకుంటాడు. ఇలా బోల్డన్ని ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ కాకుండా పర్సంటేజ్‌ విధానం వస్తే చాలామంది బతుకుతారు.

మిగతా రాష్ట్రాలో ఎలా ఉంది?
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తరహాలో రెంటల్‌ విధానం ఉంది. మద్రాసులో కొన్ని చోట్ల పర్సెంటేజ్‌ సిస్టమ్‌, మరికొన్నింటికి రెంటల్‌ విధానం ఉంది. ఇది చిత్రాన్నిబట్టి నిర్మాత, ఎగ్జిబిటర్లు సంబంధాలను బట్టి ఉంటుంది.

దీనికి ప్రభుత్వపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చుగదా?
అది ప్రభుత్వం ఇష్టం. ఏదైనా చేయాలని కొందరు కమిటీగా ఏర్పడి అడుగుడుతున్నారు.

డబ్బింగ్‌ చిత్రాల గురించి మీ అభిప్రాయం?
ఎప్పడైనా ఒక్కటే. డబ్బింగ్‌ చిత్రాలు వద్దు అనే అంటున్నాను. వస్తే మార్నింగ్‌షోకు మాత్రమే పరిమితం కావాలి. అలాఅయితే స్ట్రెయిట్‌ చిత్రాల మనుగడ ఉంటుంది. అదీకాకుండా ఇంగ్లీషు డబ్బింగ్‌ చిత్రాలు ఎక్కువగా రావడంతో... ఆ టెక్నాలజీ చూసి మన సినిమాలను చూస్తే బోర్‌ కొడతాయి. ఒక సామెత ఉంది. రాజును చూసిన కళ్లతో తన మొగుడ్ని చూస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలా ఉంది.

మల్టీస్టారర్‌ చిత్రాలు వల్లే సక్సెస్‌లు వస్తాయని భావిస్తున్నారా?
అసలు స్టార్‌లు అని ఎవరు అన్నారు.నా దృష్టిలో స్టార్‌లు కాదు. కేవలం ఆర్టిస్టులు... ఆ ఆర్టిస్టులు బాలీవుడ్‌లో ఉన్నారు. అందుకే వారు ముగ్గురు నలుగురు కలిసి నటిస్తున్నారు. మంచి చిత్రాలు వస్తున్నాయి.

'నీడ' ట్రస్ట్‌ గురించి వివరిస్తారా?
నా జన్మదినం మే 4న 'నీడ' దాసరి చారిటబుల్‌ ట్రస్ట్‌ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం. దీని ద్వారా ఎంతోమంది కళాకారులకు, ఇతర రంగాల వారికి సేవ చేయడమే నా ఉద్దేశ్యం. మహానటి సావిత్రి జాతీయ పురస్కారం 2010కుగాను జమునకు ఇస్తున్నాం. పేద విద్యార్థీవిద్యార్థులకు 32 మందిని ఎంపిక చేసి వారికి స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాం. నేను గతంలోకూడా చేసేవాడిని కానీ పబ్లిసిటీ ఇచ్చేవాడిని కాదు. కానీ ఈసారి అందరికీ తెలియాలని ఇలా చేస్తున్నాను. ఈ ట్రస్ట్‌ ద్వారా సేవలు నా తర్వాత కూడా సేవ చేయాలనేది నా ఉద్దేశ్యం

ట్రస్ట్‌లో కుటుంబసభ్యుల్లో ఒక్కరైనా ఉంటారు. మీ దానిలో లేకపోవడానికి కారణం?
అందరూ నాకుటుంబ సభ్యులే.

No comments:

Post a Comment